మెల్బోర్న్: ఐవీఎఫ్ లాంటి ఏఆర్టీ టెక్నాలజీ ద్వారా జన్మించే పిల్లలు .. యవ్వన దశలో దృఢంగా ఉంటారని, నాణ్యమైన జీవితాన్ని గడుపుతారని కొత్త అధ్యయనం తేల్చింది. హ్యూమన్ ఫెర్టిలిటీ అనే జర్నల్లో దీనికి సంబందించిన నివేదికను ప్రచురించారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ లేదా ఐవీఎఫ్ విధానాన్ని నమ్మకున్న వారిలో భరోసానిచ్చే విషయాన్ని ఆ నివేదిక వెలువరించింది. ఏఆర్టీ విధానం ద్వారా గర్భాన్ని దాల్చిన వారికి జన్మించే బిడ్డకు.. యవ్వనదశలో నాణ్యమైన ఎదుగదల ఉంటుందని రిపోర్ట్ చెప్పింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ రచయిత కరిన్ హమ్మర్బర్గ్ ఈ నివేదికను రూపొందించారు. సహజసిద్దమైన రీతిలో గర్భం దాల్చిన వ్యక్తుల శారీరక ఆరోగ్యం.. ఏఆర్టీ విధానంలో పుట్టిన వారి ఆరోగ్యం ఒకే తరహాలోనే ఉంటుందన్నారు.
1978లో తొలిసారి విట్రో ఫెర్టిలైజేషన్ విధానం అమలు చేవారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు 80 లక్షల మంది పిల్లలు ఆ పద్ధతి ద్వారా జన్మించారు. అయితే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల్లో ఉండే శారీరక, మానసిక, సైకాలజీకల్ ఎదుగుదలపై.. సహజసిద్దమైన రీతిలో జన్మించేవారితో పోల్చారు. మధ్యవయసు వచ్చే సరికి ఆ ఇద్దరిలో పెద్దగా తేడా లేదని గమనించారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఈ అంశంపై స్టడీ చేపట్టారు. ఏఆర్టీ విధానంలో పుట్టిన 193 మంది, సహజసిద్దంగా పుట్టిన 86 మంది యువతను అధ్యయనం చేశారు. డబ్ల్యూహెచ్వో ప్రామాణికం ప్రకారం నాణ్యమైన జీవన విధానం ఎలా ఉండాలన్న ప్రశ్నలు వేశారు.
ఏఆర్టీ విధానంలో పుట్టిన పిల్లల్లో సామాజిక, పర్యావరణ అంశాల్లో స్కోరింగ్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వారిలో మానసిక రుగ్మతలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఐవీఎఫ్ పద్ధతిలో పుట్టిన పిల్లలు పేరెంట్స్తో చాలా పాజిటివ్గా ఉంటున్నారు. ఆ పిల్లల ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది. బరువు విషయంలోనూ మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.