జెరుసలాం: గాజా ప్రదేశం ఓ పద్మవ్యూహం లాంటిది. ఆ ప్రాంతంలో ఉన్న టన్నెల్స్.. హమాస్ ఉగ్రవాదులకు శక్తి కేంద్రాలు. గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఇజ్రాయిల్ దళాలకు.. టెర్రర్ టన్నల్స్ను దాటి వెళ్లడమే కష్టమైన పని. అయితే ఆ మృత్యుకుహరాల నుంచి సురక్షితంగా తమ ఆపరేషన్ చేపట్టేందుకు ఇజ్రాయిల్ ఓ రహస్య ఆయుధాన్ని డెవలప్ చేసింది. స్పాంజ్ బాంబు(Sponge Bombs)లతో ఆ టన్నెల్స్లో ఆపరేషన్ కొనసాగించనున్నది. స్పాంజ్ బాంబు ఓ రసాయనిక బాంబు. ఆ బాంబు పేలడంతో ఫోమ్ వస్తోంది. ఆ ఫోమ్ టన్నెల్స్లో ఉన్న గ్యాప్లను మూసివేస్తాయి. దీంతో ఉగ్రవాదుల కదలికలను నియంత్రించవచ్చు అని ఇజ్రాయిల్ దళాలు భావిస్తున్నాయి. ఓ ప్లాస్టిక్ కంటేనర్లో ఉన్న రెండు ద్రవాలు .. పేలిన తర్వాత స్పాంజ్ బాంబుగా మారుతాయి.
గాజాలో ఉన్న టన్నెల్స్ అంతుచిక్కని నెట్వర్క్. టన్నెల్స్ వెళ్తున్న రూట్లోనే ఇండ్లు, మసీదు, చర్చిలు ఉన్నాయి. గాజా మెట్రోగా ఆ టన్నెల్స్ను పిలుస్తుంటారు. అయితే గ్రౌండ్ ఆపరేషన్లో గాజా మెట్రో టన్నెల్స్ కీలకం కానున్నాయి. ఇటీవల దాడి తర్వాత హమాస్ ఉగ్రవాదులు సుమారు 200 బందీలను ఆ టన్నెల్స్కు తీసుకు వెళ్లినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అండర్గ్రౌండ్ టన్నెల్స్ సుమారు 311 మైళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత దూరం ఉండే ఈ టన్నెల్స్లో ఎలా ఇజ్రాయిల్ దళాలు ముందకు కదులుతాయో అంచనా వేయడం అసాధ్యమే. సుమారు వంద ఫీట్ల లోతులో ఉండే ఆ టన్నెల్స్ చిమ్మచీకటితో నిండి ఉంటాయి. ఏ టన్నెల్ ఎటు వెళ్తుందో తెలియదు. ఎక్కడ ఎటువంటి ట్రాప్ ఉందో కూడా తెలుసుకోలేం. కాంక్రీట్తో ఉన్న ఆ టన్నెల్స్.. ఇజ్రాయిల్ దళాలకు గ్రౌండ్ ఆపరేషన్ అంత సులువేమీ కాదు.