జెరూసలెం : పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ (Israel-Hamas War) లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా స్ట్రిప్ నిలువెల్లా వణుకుతోంది. గడిచిన 24 గంటలుగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు 450 హమాస్ స్ధావరాలను ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్) వెల్లడించింది. సైనిక కేంద్రాలు, అబ్జర్వేషన్ పోస్టులు, ఉగ్ర సంస్ధకు చెందిన యాంటీ ట్యాంక్ ఫైరింగ్ పొజిషన్స్ను తమ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని ఐఏఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరోవైపు గాజా స్ట్రిప్లో భూతల దాడులను తీవ్రతరం చేసేందుకు దళాల సైనికుల సంఖ్యను పెంచామని ఇజ్రాయెల్ భద్రతా దళం (ఐడీఎఫ్) వెల్లడించింది.
కాగా, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్తో ఇజ్రాయెల్ భీకర యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరగా హమాస్ను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు (ఐడీఎఫ్) మలి దశ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. భూతల ఆపరేషన్స్లో భాగంగా 150 సొరంగాలు, బంకర్స్ సహా 150 హమాస్ స్ధావరాలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా రణక్షేత్రంగా మారిందని ఉత్తర గాజా పౌరులను ఐడీఎఫ్ హెచ్చరించింది. ఈ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు, ఉగ్ర మూక స్ధావరాలు, మౌలిక వసతుల విధ్వంసమే లక్ష్యంగా ఐడీఎఫ్ విరుచుకుపడుతోంది.
గాజాలో హమాస్పై రెండవ దశ యుద్ధాన్ని తమ దళాలు చేపట్టాయని ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు టెల్ అవీవ్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.ఉపరితలంలో, గగనతలంలో శత్రువును తుదముట్టించేందుకు శత్రు మూకలను వెంటాడుతున్నామని వెల్లడించారు. హమాస్తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ మనుగడ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. గాజాలో మలి విడత భూతల దాడులు దీర్ఘకాలం కొనసాగుతాయని తెలిపారు. హమాస్ను అంతమొందించే వరకూ పోరాటం కొనసాగించి విజేతలుగా నిలుస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు.
Read More :
Bomb Blast | కాలామస్సేరి పేలుళ్లపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విచారం