(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్ ఫైర్ డీల్) కుదిరినప్పటికీ.. పశ్చిమాసియాలో బుధవారం కూడా దాడులు కొనసాగాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 100 వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 200 మందికి పైగా మృత్యువాతపడగా.. 700 మంది క్షత్రగాత్రులయ్యారు. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అతి పెద్ద దాడి అని అధికారులు తెలిపారు. మరోవైపు, ఇరాన్లోని ఓ చమురు శుద్ధి కేంద్రంపై దాడులు జరగ్గా.. దీనికి ప్రతిగా కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది.
లెబనాన్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) భీకర దాడులు జరిపింది. బీరుట్, దక్షిణ లెబనాన్, బెకా నగరాలతో పాటు హెజ్బొల్లా ఉపయోగించే కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా 10 నిమిషాల వ్యవధిలోనే 100 ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ఈ భీకర దాడుల్లో 89 మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. 700 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ దాడుల్లో లెబనాన్లోని ప్రముఖ మత పెద్ద సాధిక్ అలీ నబుల్సీ మృతి చెందారు. 1982 తర్వాత లెబనాన్పై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు తెలిపారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్టు రెడ్క్రాస్ వెల్లడించింది. క్షతగ్రాత్రులతో లెబనాన్లోని అన్ని దవాఖానలు నిండిపోయినట్టు ఆరోగ్యమంత్రి తెలిపారు.

పౌర సమాజంలో హెజ్బొల్లా పాతుకుపోవడాన్ని లెబనాన్ ప్రభుత్వం, అక్కడి ప్రజలు వ్యతిరేకించాలని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. లేకపోతే, ఇలాంటి పరిస్థితులు పునరావృతమవుతాయని హెచ్చరించింది. మరోవైపు, ఇజ్రాయెల్ దాడులను నిలుపుదల చేసేందుకు సాయం చేయాలని మిత్ర దేశాలకు లెబనాన్ ప్రధాని నవాఫ్ సాలమ్ విజ్ఞప్తి చేశారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామన్న సాలమ్.. తాము కూడా ఈ ఒప్పందంలో భాగమైనట్టు తెలిపారు. అయినప్పటికీ, ఇజ్రాయెల్ ఇలా విరుచుకుపడటమేంటని ప్రశ్నించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులపై హెజ్బొల్లా ఇంకా స్పందించలేదు.

ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, మరోవైపు పశ్చిమాసియా.. దాడులు ప్రతిదాడులతో బుధవారం కూడా దద్దరిల్లింది. ఇరాన్లోని లావన్ ద్వీపంలో ఉన్న ఓ ఆయిల్ రిఫైనరీపై దాడులు జరిగాయి. దీంతో అక్కడ పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడులు ఎవరు చేశారన్న విషయం తెలియరానప్పటికీ, ఇజ్రాయెల్-అమెరికా దళాలే ఈ పనిచేసినట్టు ఇరాన్ ఆరోపిస్తున్నది. తమపై దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. కువైట్లోని పలు చమురు, విద్యుత్తు క్షేత్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని కొన్ని ప్రాంతాలపై కూడా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది.
ఇరాన్తో తాము చేసుకొన్న కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. హెజ్బొల్లా కారణంగానే ఈ డీల్కు లెబనాన్ను దూరంగా పెట్టామని పేర్కొన్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను ప్రస్తావించగా ఆయన ఈ మేరకు స్పందించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రస్తుత సీజ్ ఫైర్ డీల్తో సంబంధంలేనివని తేల్చి చెప్పారు.