Abu Hamza : ఇరాన్, ఇజ్రాయెల్ (Iran, Israel) దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్కు మద్దతుగా లెబనాన్ (Lebanon) లోని పలు మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడటంతో.. ఇజ్రాయెల్ వారిపై ప్రతిదాడులు చేస్తోంది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్ (Beirut) పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ – పీఐజే (Palestinian Islamic Jihad – PIJ) కమాండర్ అబూ హమ్జా రామి (Abu Hamza Rami) మృతి చెందాడు.
అబూ హమ్జాను మట్టుబెట్టిన విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా వెల్లడించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని హెజ్బొల్లా అనుబంధ అల్-మనార్ ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరికలు జారీచేసిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. దాడిలో అబూ హమ్జా హతమయ్యాడు. అబూ హమ్జా ఇజ్రాయెల్ బలగాలపై, పౌరులపై అనేక దాడులు చేయించాడని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకు ప్రతీకారంగానే అతడిపై దాడి చేశామని తెలిపింది.
ఇక బీరుట్లోనే జరిగిన మరో దాడిలో హజ్బొల్లా సంస్థకు చెందిన కీలక నేత హతమయ్యాడు. హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్ అధిపతి హుస్సేన్ మాక్లెడ్ ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. లెబనాన్ నుంచి మిలిటెంట్ గ్రూపులు తమ దేశంపై చేస్తున్న దాడులకు ప్రతిగానే తాము ఈ దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.