న్యూఢిల్లీ: కొవిడ్ న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతున్నది. ఒమిక్రాన్ విస్తృతికి భయపడి చాలా దేశాలు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలకు సరిహద్దులను మూసేసి రైలు, రోడ్డు మార్గాల్లో కూడా విదేశీయులను తమ దేశంలోకి రానీవడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. తమ దేశానికి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసేసింది. విదేశీ ప్రయాణికుల దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.
అయితే, స్పెషల్ కమిటీ ఆమోదం తెలిపిన ఫారినర్స్కు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఆదివారం సాయంత్రం నుంచే నిషేధం అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన వాళ్లు విదేశాల నుంచి తిరిగి రావాలంటే నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టును చూపించాల్సి ఉంటుందని తెలిపింది. వారికి డోసుల వ్యాక్సినేషన్ పూర్తయి ఉంటే మూడు రోజులు లేదంటే ఏడు రోజులు క్వారెంటైన్లో ఉండాలని పేర్కొన్నది.
ఇజ్రాయెల్ ప్రభుత్వం కరోనా మహమ్మారి విజృంభన కారణంగా సుదీర్ఘ కాలం నుంచి సరిహద్దులు మూసి ఉంచింది. అయితే, ఇటీవల కరోనా ప్రభావం తగ్గిపోవడంతో నాలుగు వారాల క్రితమే సరిహద్దులను తిరిగి తెరిచింది. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ ప్రమాదకర రీతిలో విస్తరిస్తుండటంతో మరోసారి దేశ సరిహద్దుల మూసివేత నిర్ణయం తీసుకున్నది. దేశంలో కొవిడ్ పరిస్థితిపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ దేశ సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించగా.. ఈ ఉదయం ఆ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో ఇజ్రాయెల్ సరిహద్దులు మరోసారి మూతపడ్డాయి.