కాబూల్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించింది. ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పడినట్లు స్విట్జర్లాండ్లోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్లో ఉన్న ఏకైక ‘చట్టబద్ధమైన ప్రభుత్వం’ ఇదేనని పేర్కొంది. దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ మరే ఇతర ప్రభుత్వం ఈ చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని భర్తీ చేయలేదని తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్ ‘బాహ్య శక్తుల’ ఆక్రమణలో ఉన్నందున అధ్యక్షుడు అష్రఫ్ ఘని పరిపాలన యంత్రాంగం దేశ పెద్దలతో తగిన సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రవాస ప్రభుత్వాన్ని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్విట్జర్లాండ్లోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఘనీ దేశం విడిచిన తర్వాత కేర్ టేకర్గా ఉన్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ప్రవాసంలోని ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారని తెలిపింది. అయితే ప్రభుత్వంలోని మిగతా సభ్యుల గురించి ఆ ప్రకటనలో ప్రస్తావించలేదని ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.