Iran vs Israel : ఇరాన్కు ఇజ్రాయెల్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సమయం వచ్చినప్పుడు ఇరాన్ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఇటీవల డ్రోన్లు, మిస్సైళ్లతో దాడిచేసింది. ఈ దాడిని బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాల సహకారంతో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరాన్కు హెచ్చరికలు చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆదివారం వ్యాఖ్యానించారు. తాజాగా ఇజ్రాయెల్ మంత్రి బెన్నీ గాంట్జ్ కూడా సరైన సమయంలో ఇరాన్ మూల్యం చెల్లించేలా చేస్తామని హెచ్చరించారు.
కాగా, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగానే తాము ఆ దేశంపై దాడి చేయాల్సి వచ్చిందని, మమ్మల్ని మేం కాపాడుకునే హక్కు మాకు ఉందని ఇరాన్ ప్రతినిధి ఐక్యరాజ్యసమితికి తెలిపాడు. ఇదిలావుంటే మాపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసిన ఇరాన్పై భద్రతామండలి ఆంక్షలు విధించాలని ఐరాసను ఇజ్రాయెల్ కోరింది. ఇంతటితో ఇజ్రాయెల్పై మా ఆపరేషన్ ముగిసిందని, వాళ్లు మళ్లీ మమ్మల్ని రెచ్చగొడితే పరిణామాలు ఇంతకంటే తీవ్రంగా ఉంటాయని ఐరాసలో ఇరాన్ పేర్కొంది.
ఇదిలావుంటే ఇరాన్పై చేసే ప్రతీకార దాడులకు తాము ఎలాంటి సైనిక సాయం అందించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుకు తెలియజేశాడు. ఇరాన్, ఇజ్రాయెల్ వివాదంపై భారత్ కూడా స్పందించింది. రెండు దేశాల మధ్య సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించింది. తాము పరిస్థితి పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది.