Mojtaba Khamenei : ఇరాన్ తమ దేశ నూతన సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. కొత్త సుప్రీం లీడర్గా అయతొల్లా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 56 ఏళ్ల అయతొల్లా సయ్యద్ మొజ్తాబా హొస్సేని ఖమేనీ అలియాస్ మొజ్తాబా ఖమేనీ ఇరాన్కు మూడో సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. మొజ్తాబాను ఇరాన్ అసెంబ్లీ నిపుణుల బృందం ఎన్నుకుంది.
ఇందులో 88 మంది ఇస్లాం మత గురువులు ఉంటారు. వీరందరూ కలిసి ఆదివారం సమావేశమై కొత్త సుప్రీం లీడర్ కోసం చర్చ జరిపారు. మెజారిటీ సభ్యులు మొజ్తాబా వైపు మొగ్గు చూపారు. కొందరు సభ్యులు వారసత్వ నాయకత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ.. మెజారిటీ ఉండటంతో మొజ్తాబానే ఎన్నుకున్నారు. ఒకవైపు ఇరాన్పై దాడులు కొనసాగుతున్నా, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ కొత్త లీడర్ ఎంపికను ఇరాన్ పూర్తి చేసింది. అతడు, ఎప్పటినుంచి బాధ్యతలు స్వీకరిస్తారో తెలియరాలేదు. మొజ్తాబాకు విదేశాల్లో భారీగా ఆస్తులున్నాయి. అతడికి లండన్లో దాదాపు 2,500 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు అంచనా. కెన్సింగ్టన్ ప్యాలెస్లో అతడికి ఖరీదైన అపార్ట్మెంట్లు ఉన్నాయి. 2014 నుంచి లండన్లో ఆస్తులు కలిగి ఉన్నాడు. అక్రమ చమురు అమ్మకాల ద్వారా ఇదంతా సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఇటీవలి పరిణామాల నేపథ్యంలో లండన్లోని అతడి ఆస్తులపై ఇజ్రాయెల్, అమెరికా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. అతడి ఆస్తులకు భద్రతాపరమైన ముప్పు ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. మరోవైపు మొజ్తాబా ఎంపికను అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునేముందు తమ అనుమతి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. అలాగే కొత్త లీడర్ ఎవరైనా సరే అంతం చేస్తామని ఇజ్రాయెల్ ఇదివరకే ప్రకటించింది.