న్యూఢిల్లీ: ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో మృతి చెందారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్కు పని చేస్తున్న ఆయన.. గురువారం రాత్రి కాందహార్లో జరిగిన తాలిబన్ల దాడిలో మరణించారు. ఆఫ్ఘన్ స్పెషల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్కడి పరిస్థితిపై ఆయన రిపోర్ట్ చేస్తున్నారు. స్పిన్ బోల్డక్లోని ప్రధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్ ప్రత్యేక దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తాలిబన్లు ఫైరింగ్ జరిపారు. ఇందులో సిద్దిఖీతోపాటు ఓ సీనియర్ ఆఫ్ఘన్ ఆఫీసర్ కూడా మృతి చెందారు.
డానిష్ ఓ అద్భుతమైన జర్నలిస్టు. మంచి భర్త, తండ్రి, అంతకుమించి మంచి సహచరుడు. ఇలాంటి కష్ట సమయంలో సిద్దిఖీ కుటుంబానికి అండగా ఉంటాం అని రాయ్టర్స్ ప్రెసిడెంట్ మైకేల్ ఫ్రైడెన్బెర్గ్, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెజాండ్రా గాలోని ఒక ప్రకటనలో అన్నారు.
సురక్షితంగా ఉన్నానంటూనే..
ఈ దాడికి మూడు రోజుల ముందే తాను సురక్షితంగా ఉన్నందుకు చాలా అదృష్టవంతున్ని అని సిద్దిఖీ ట్వీట్ చేశారు. 2018లో రోహింగ్యా శరణార్థుల సమస్య అంశంలో ఆయన చేసిన పనికిగాను సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు వచ్చింది. ఆయన మరణం గురించి ఆఫ్ఘనిస్థాన్లో ఇండియా రాయబారి ఫరీద్ మాముంద్జాయ్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్తుండటంతో అంతకుముందు అక్కడి కాన్సులేట్లోని 50 మంది అధికారులు, దౌత్యవేత్తలను భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.