వాషింగ్టన్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య, ముగ్గురు పిల్లలను చంపిన భారత సంతతి టెక్కీకి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. 55 ఏళ్ల శంకర్ నాగప్ప హంగుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడని దర్యాప్తు అధికారి తెలిపారు. స్టాఫ్వేర్ ఇంజినీర్ అయిన శంకర్ నాగప్ప తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియా జంక్షన్ బౌలేవార్డ్లోని వుడ్క్రీక్ వెస్ట్ కాంప్లెక్స్ వద్ద రోజ్విల్లే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే అతడు ఉద్యోగం కోల్పోవడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
దీంతో కుటుంబానికి ఆధారంగా ఉండలేని శంకర్, తన భార్యా పిల్లలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 2019 అక్టోబర్లో వరుసగా కుటుంబ సభ్యులను చంపడం ప్రారంభించాడు. అక్టోబర్ 7న తొలుత 46 ఏండ్ల భార్య జ్యోతి, 16 ఏండ్ల కుమార్తె గౌరి, 13 ఏండ్ల చిన్న కుమారుడు నిశ్చల్ను తన అపార్ట్మెంట్లో హత్య చేశాడు.
అనంతరం అక్టోబర్ 13న రోజ్విల్లే, మౌంట్ శాస్తా మార్గం మధ్యలో 20 ఏండ్ల పెద్ద కుమారుడు వరుణ్ను చంపాడు. కుమారుడి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి 320 కిలోమీటర్ల దూరంలోని మౌంట్ శాస్తా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తన కుటుంబంలోని నలుగురిని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.
దీంతో పోలీసులు కారులో ఉన్న కుమారుడి మృతదేహంతోపాటు అపార్ట్మెంట్లో ఉన్న భార్య, కుమార్తె, చిన్న కుమారుడి మృతదేహాలను గుర్తించారు. శంకర్ నాగప్పను అరెస్ట్ చేశారు. కాగా, నాడు ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది.
మరోవైపు శంకర్ మొదట్లో ఈ హత్యలకు తాను నిర్దోషినంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే గత నెలలో తన అభ్యర్థనను ఆయన మార్చుకున్నాడు. తన ముగ్గురు పిల్లలను హత్య చేయడంతోపాటు భార్య ఆత్మహత్యకు తానే కారణమని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్లేసర్ కౌంటీ కోర్టు, శంకర్ నాగప్పకు పెరోల్కు వీలు లేని జీవిత కారాగార శిక్ష విధించింది.