US President | అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హత్యకు కుట్ర పన్ని ఓ తెలుగు సంతతి యువకుడు పట్టుబడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చిన ఓ యువకుడు బారికేడ్లను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నినట్లుగా కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సాయివర్షిత్ కందుల అమెరికాలోని మిస్సోరి స్టేట్ చెస్ట్ఫీల్డ్లో ఉంటున్నాడు. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుంచి అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవల మిస్సోరి నుంచి వాషింగ్టన్ డీసీకి ఫ్లైట్లో వచ్చిన సాయివర్షిత్ వచ్చీరాగానే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్హౌస్లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో మొదటి బారికేడ్ వద్దనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ విషయాన్ని అధికారులు మంగళవారం ఉదయం బైడెన్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్మీడియా అకౌంట్స్ ద్వారా సాయివర్షిత్ గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.