న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గద్దె దిగనున్నాడా..? ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే.. బోరిస్ జాన్సన్ తన అధికారిక నివాసంలో మందు పార్టీ చేసుకోవడం ఆయన కుర్చీకి ఎసరు తెచ్చిందా..? జాన్సన్ పదవి నుంచి దిగిపోతే భారత సంతతి వ్యక్తికి ఆ కుర్చీ దక్కబోతుందా..? అంటే బ్రిటన్ అధికార పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లనున్నాయా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తున్నది. దీనిపై బ్రిటన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బోరిస్ జాన్సన్కు కాలం దగ్గర పడిందని అక్కడి పత్రికలూ విశ్లేషిస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగులు దీన్ని బలపరుస్తున్నాయి.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (57) ఏడాదిన్నర క్రితం దేశాన్ని కొవిడ్ కుదిపేస్తున్న వేళ ’10 డౌన్ స్ట్రీట్’లోని తన అధికారిక నివాసంలో సహచరులతో కలిసి మద్యంతో విందు నిర్వహించాడు. ఇప్పుడు ఆ ఘటనే ఆయన ప్రధాని కుర్చీ కిందకు నీళ్లు తెచ్చింది. కొవిడ్ కట్టడికి దేశంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ప్రధాని విందు చేసుకోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిగువసభలో క్షమాపణలు చెప్పిన బోరిస్ జాన్సన్
ప్రతిపక్ష లేబర్ పార్టీతోపాటు సొంత కన్జర్వేటివ్ పార్టీ కూడా ఆయన తీరును తప్పుబట్టింది. దాంతో ఆయన గురువారం దిగువ సభ ‘హౌస్ ఆఫ్ కామన్స్’ సాక్షిగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. క్షమాపణలు చెప్పినప్పటికీ బోరిస్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనన్న డిమాండ్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోరిస్ దిగిపోతే ఆయన స్థానంలో వారసుడిగా వచ్చేది ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది.
ఈ చర్చల్లో ఇప్పుడు ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు వినిపిస్తున్నది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దిగువసభలో బోరిస్ క్షమాపణలు చెబుతున్న సమయంలో రిషి అక్కడ లేకపోవడంపై అక్కడి మీడియా అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రధానిపై ఆరోపణల నుంచి దూరంగా ఉండటం కోసమే ఆయన సభకు రాలేదని పేర్కొన్నాయి. కానీ, ఉద్యోగ కల్పనపై ముఖ్యమైన సమావేశం ఉండటంతో తాను సభకు రాలేదని రిషి సునక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కాగా, ఇలాంటి ఊహాగానాలపై బ్రిటన్లో ‘బెట్ఫెయిర్’ అనే ఆన్లైన్ సంస్థ బెట్టింగ్ నిర్వహిస్తుంటుంది. బోరిస్ తప్పుకొంటే ప్రధాని రేసులో రిషి సునక్కు అత్యధిక మంది మద్దతు లభించే అవకాశం ఉన్నట్లు బెట్ఫెయిర్ పేర్కొన్నది. ఇక వివిధ బెట్టింగులను పోల్చిచూసే ‘ఆడ్స్చెకర్’ సైతం బోరిస్ వారసుల రేసులో రిషి సునక్ ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నది.