హైదరాబాద్ : ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారాన్ని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ దక్కించుకున్నారు. అమెరికాలో వార్తాపత్రిక, పత్రికా ఆన్లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మేఘ రాజగోపాలన్ మరో ఇద్దరితో కలిసి గెలుచుకున్నారు. మేఘ రాజగోపాలన్ పరిశోధాత్మక కథనం, అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు.
2017 లో, జిన్జియాంగ్లో చైనా వేలాది మంది ముస్లింలను నిర్బంధించేందుకు డ్రాగన్ రహస్యంగా నిర్మించిన జైళ్లు, సామూహిక నిర్బంధ శిబిరాలను ఈ జర్నలిస్టు బహిర్గతం చేసింది. అమెరికా బజ్ఫీడ్ న్యూస్ సంస్థలో పని చేస్తున్న మేఘ రాజగోపాలన్, అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుస్చెక్ తమ పరిశోధనాత్మక కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించారు. చైనా వీగర్ ముస్లింల హక్కులను కాలరాస్తుందంటూ పలు దేశాల్లో మైనార్టీలు ఆందోళనలు చేశారు. మేఘ చర్యలను తీవ్రంగా పరిగణించిన చైనా.. ఆమెను నిశ్శబ్దంగా ఉంచేందుకు చాలా ప్రయత్నించింది. మేఘ వీసాను రద్దు చేసిందని, ఆమెను దేశం నుంచి వెళ్లిపోవాలని బెదిరించింది అని బజ్ఫీడ్ న్యూస్ బహుమతి కోసం పంపిన తన ఎంట్రీలో వెల్లడించింది.