రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వున్న భారతీయుల గురించి వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్- భారత్ మధ్య నడిచే విమానాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా భారతీయులు సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ నుంచి భారత్కు రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదే విషయంపై సివిల్ ఏవియేషన్ అధికారులు, ఇతర ఎయిర్ లైన్స్కు చెందిన వారితోనూ అధికారులు చర్చలు జరుపుతున్నారని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు వీలైనంత తొందరగా స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్- ఉక్రెయిన్ మధ్య విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు రోజు రోజుకీ రష్యా- ఉక్రెయిన్ మధ్య వాతావరణం గంభీరంగా మారిపోవడంతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తాము స్వదేశానికి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేయాలని అభ్యర్థిస్తున్నారు.