న్యూయార్క్, ఫిబ్రవరి 14: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. మృతుల్లో నాలుగేండ్ల వయసున్న కవలలు కూడా ఉన్నారు. అగ్రరాజ్యంలో భారతీయ కుటుంబం మృతి చెందడం రెండు నెలల్లో ఇది రెండోది. దీనికి తోడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల వరుస మరణాలు అమెరికాలోని భారతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి.
సోమవారం శాన్ మటేయోలో జరిగిన తాజా ఘటనలో మృతులను కేరళకు చెందిన ఆనంద్ సుజీత్ హెన్రీ, ఆయన భార్య అలైస్ ప్రియాంక, వారి కుమారులైన కవల సోదరులుగా గుర్తించారు. వెల్ఫేర్ చెక్లో కుటుంబం స్పందిచకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా విషాదం వెలుగు చూసింది.
భార్యాభర్తల శరీరాలపై తుపాకి గాయాలు ఉన్నాయి. చిన్నారుల మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. పోస్టుమార్టం తర్వాత మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కాగా, డిసెంబర్ 2016లో సుజీత్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. అదింకా విచారణలో ఉంది. వీరి మరణాలకు బహుశా కుటుంబ కలహాలే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.