India-China flights : దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-చైనా (India-China) దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ (Direct flight services) పునఃప్రారంభం కాబోతున్నాయి. భారత్-చైనా మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులను సెప్టెంబర్ నెలలో పునరుద్ధరించే అవకాశం ఉందని బ్లూమ్బర్గ్ నివేదిక (Blumberg report) వెల్లడించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో తదితర విమానయాన సంస్థలు చైనాకు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించినట్లు తెలిపింది.
గల్వాన్ లోయలో 2020లో జరిగిన సైనిక ఘర్షణలతో భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే రెండు దేశాల మధ్య డైరెక్టుగా నడిపే విమాన సర్వీసులను రద్దుచేశారు. అదేవిధంగా చైనాకు సంబంధించిన పలు యాప్లను భారత్ నిషేధించింది. చైనా పెట్టుబడులపై కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపలేదు. చైనా దిగుమతులపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది.
అయితే ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు కొనసాగించడంతో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఆర్థిక, వాణిజ్యపరంగా ఇండియా, చైనా దేశాలు అమెరికాను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.