Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఎనిమిది రోజుల పాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) కస్టడీకి బుధవారం కోర్టు అప్పగించింది. ఈ విషయాన్ని స్థానిక పత్రిక డాన్ తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్పై అభియోగాలు మోపారు. ఆగస్టు 2022లో పాక్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తోషఖానాకు సమర్పించిన బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించారని, వాటి ఆదాయాన్ని వెల్లడించలేదంటూ ఇమ్రాన్పై కేసు నమోదు చేసింది. మరో వైపు అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో 14 రోజుల రిమాండ్ కోరగా.. నాబ్ పిటిషన్పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఇమ్రాన్ను కోర్టులో హాజరుపరిచే ముందు ఇస్లామాబాద్లోని హెచ్-11లోని పోలీస్ లైన్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. మరో వైపు అరెస్టుకు నిరసనగా పాకిస్తాన్లోని క్వెట్టా, కరాచీ, పెషావర్, రావల్పిండి, లాహోర్లతో సహా పలు నగరాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. పీటీఐ మద్దతుదారులు రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, లహోర్లోని కార్ప్స్ కమాండర్ ఇంటిపై దాడి చేశారు. పీటీఐ పార్టీ చైర్మన్గా ఇమ్రాన్ ఖాన్ అల్ ఖదిర్ టస్ట్ కేసు విచారణ సందర్భంగా ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరైన సమయంలో పాక్ రేంజర్లు ఆయనను అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి.