Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల హత్యాయత్నం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్తో నవంబర్ తొలివారంలో పాక్ పంజాబ్లోని వజీరాబాద్ అల్లావాలాచౌక్లో ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసింగించేందుకు ఇమ్రాన్ కంటెయినర్పైకి ఎక్కి నిలబడిన సమయంలో.. ఓ దుండగుడు ఇమ్రాన్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలయ్యాయి. బుల్లెట్ గాయాల నుంచి కోలుకున్న ఆయన మొదటిసారిగా ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజీరాబాద్ దాడి ఘటన గురించి ప్రస్తావించారు. తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్లు చెప్పారు.
‘నన్ను హత్య చేసేందుకు ముగ్గురు షూటర్లు యత్నించారు. మొదట ఇద్దరు షూటర్లు కనిపించారు. వారిలో ఒక షూటర్ నాపై కాల్పులు జరిపాడు. రెండో షూటర్ పీటీఐ నేతలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. మూడో షూటర్… నాపై కాల్పులు జరిపిన తొలి షూటర్ను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు’ అని వివరించారు.
కాగా, దాడి జరుగుతుందని తనకు ముందే సమాచారం ఉందని ఇటీవల ఇమ్రాన్ తెలిపారు. వజీరాబాద్, గుజరాత్లో తనను చంపేందుకు పథకం రచించినట్లు ముందు రోజే తెలిసిందన్నారు. పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తసీర్ను చంపినట్టే తనను కూడా హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. తనపై హత్యాయత్నం వెనుక ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోంమంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మేజర్ జనరల్ ఫైజల్ నజీర్ ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.