విశ్వాస పరీక్షకు రెడీ కావాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్కు సుప్రీం ఝలక్ ఇచ్చింది. దీంతో ఆయన ఢీలా పడిపోయారు. అయితే.. అంతలోనే తేరుకోని… మరో పాచిక వేయడానికి ఇమ్రాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. తాను చివరి బంతి వరకూ ఆడుతూనే వుంటానని ఇప్పటికే ఇమ్రాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే.. చివరి బంతి ఆడేందుకు ఇమ్రాన్ రెడీ అయ్యారు. అవిశ్వాసం అన్న ఘట్టం ఆవిష్కృతం కాకుండా ఉండేందుకు ఇమ్రాన్ నానా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.
తాజాగా… ఇమ్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం (శుక్రవారం) ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఇమ్రాన్ మాత్రమే కాకుండా తన పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులందరూ రాజీనామాలు చేయనున్నారు. అలాగే.. తన పార్టీ టిక్కెట్పై విజయం సాధించి, ఇప్పుడు పార్టీని వీడిన వారిపై అనర్హత వేయాలని కూడా నిర్ణయించారు. సుప్రీం నిర్ణయం ప్రకారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ ఘట్టం ఆవిష్కృతమైతే.. ప్రభుత్వం పడిపోతుందన్నది ఇమ్రాన్ అంచనా.
శుక్రవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగం
సుప్రీం కోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అవిశ్వాస తీర్మానం, సుప్రీం తీర్పుపై రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే.. తాను చివరి బంతి వరకూ ఆడుతూనే వుంటానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని ఇమ్రాన్ పాకిస్తాన్ ఫెడరల్ కేబినెట్తో భేటీ అయ్యారు.