పాక్ ప్రధాని ఇమ్రాన్కు గొప్ప ఊరట లభించింది. ఏప్రిల్ 3 వరకూ పార్లమెంట్ను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని ఇమ్రాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంట్ను వాయిదా వేయడం ఆసక్తికర పరిణామం. ఈ 3 రోజులు పాక్ ప్రధాని ఇమ్రాన్కు చాలా కీలకమైన రోజులని, ఆయన కుర్చీని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. ఇక… అవిశ్వాసంపై ఏప్రిల్ 3న చర్చ జరిగే అవకాశాలున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చకు కొద్ది గంటల ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే.. తాను పార్లమెంట్ను రద్దు చేస్తానని ప్రతిపక్షాలకు ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని ఇమ్రాన్ కోటరీలోని ఓ కీలక వ్యక్తి ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్కు చేరవేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతలు ఓ చోట సమావేశమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పాక్లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని, దీనికి విరుగుడు ఇదేనని ఇమ్రాన్ సందేశం పంపారు. ఒకవేళ తాను పంపిన ప్రతిపాదనకు ప్రతిపక్షాలకు అంగీకరించని పక్షంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను రెడీగా ఉన్నానని ఇమ్రాన్ తేల్చి చెప్పారు.