కీవ్: ఉక్రెయిన్లో ఉన్న జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై నిన్న దాడి జరిగింది. రష్యా జరిపిన కాల్పుల్లో ఆ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఆ మంటల్ని ఆర్పినట్లు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ శాఖ తెలిపింది. కానీ ఒకవేళ ఆ అణు కేంద్రం పేలి ఉంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో అర్ధం కావడం లేదు. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ యూరోప్లోనే పెద్ద అణు విద్యుత్తు కేంద్రం. ఆ ప్లాంట్లో మొత్తం ఆరు రియాక్టర్లు ఉన్నాయి. ఒకవేళ ఆ ప్లాంట్లో పేలుడు జరిగితే, దాని ప్రభావం చెర్నోబిల్ ఘటన కన్నా పది రెట్లు ఎక్కువగా ఉంటుందని ఉక్రెయిన్ విదేశాంగ మత్రి డిమిట్రో కులేబా తెలిపారు.
గురువారం జరిగిన ఫైరింగ్లో ప్లాంట్లోని ఓ రియాక్టర్ వద్ద మంటలు వ్యాపించాయి. ఆ ఘటన తర్వాత అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ, అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్ అధికారులతో టచ్లో ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఒకవేళ మంటల్ని ఆర్పకుంటే అప్పుడు ఆ అణు కేంద్రం పూర్తిగా ధ్వంసం అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ న్యూక్లియర్ సెక్యూర్టీ ఎక్స్పర్ట్ గ్రహమ్ అలిసన్ తెలిపారు. అదే కనుక జరిగితే కొన్నేళ్ల పాటు ఆ ప్రాంతంలో రేడియోయాక్టివిటీ ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1986లో జరిగిన చెర్నోబిల్ విషాదం తరహాలోనే ఉంటుందన్నారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉక్రెయిన్లోనే ఉన్నది.
జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్లో ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ తక్కువగా ఉండి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సమీప ప్రాంతాలకు ఈ ప్లాంట్ నుంచే విద్యుత్తు శక్తి అందుతుంది. అందుకే రష్యా దళాలు ఆ ప్లాంట్ను మూసివేయాలని భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద రేడియేషన్ లెవల్స్లో మార్పులేదని శాస్త్రవేత్తలు తెలిపారు. జపోరియా అణు కేంద్రం.. ఉక్రెయిన్ దేశానికి నాలుగో వంతు విద్యుత్తును అందిస్తోంది.
అతిపెద్ద అణు కేంద్రం మంటల్లో ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. తన ట్విట్టర్లో వీడియో పోస్టు చేసిన జెలెన్స్కీ.. రష్యన్లు కావాలనే ఆ ప్లాంట్పై ఫైరింగ్ జరిపినట్లు తెలిపారు. యూరోప్ ప్రజలారా మేల్కోండి.. రష్యా బలగాలు న్యూక్లియర్ ప్లాంట్ను షూట్ చేసినట్లు మీ రాజకీయ నేతలకు చెప్పాలంటూ తన వీడియోలో జెలెన్స్కీ కోరారు.