పేషావర్ ర్యాలీలో పాల్గొంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా డేంజర్గా వ్యవహరించలేదని, అధికారం పోయింది కాబట్టి, ఇప్పుడు మరింత డేంజర్గా వ్యవహరిస్తానని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు నేను డేంజర్గా లేను. కానీ.. ఇప్పుడు మరింత డేంజర్గా వ్యవహరిస్తా అంటూ హెచ్చరించారు.
కోర్టులపై తీవ్రంగా మండిపడ్డ ఇమ్రాన్…
అవిశ్వాస పరీక్ష సమయంలో కోర్టులు వ్యవహరించి తీరుపై కూడా ఇమ్రాన్ తీవ్రంగా మండిపడ్డారు. అంత అర్ధరాత్రి కోర్టులకు ఏం పని ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. అసలు అర్ధరాత్రి వరకూ కోర్టును ఓపెన్ చేసి ఉంచడం వెనుక మర్మమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 45 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలు నన్ను గమనిస్తూనే వున్నారు. నేను ఎప్పుడైనా చట్టాన్ని అతిక్రమించానా? చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాను. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయా? అర్ధరాత్రి కోర్టును తెరవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పండి? అంటూ ఇమ్రాన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ప్రతి ప్రధాని గద్దె దిగినప్పుడు ప్రజలు సంబరాలు చేసుకుంటారని, కానీ… తాను పదవి నుంచి దిగిపోయిన సందర్భంలో ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. తనను గద్దె దింపడానికి పాక్లోని ప్రతిపక్షాలు, వాషింగ్టన్ కలిసి కుట్ర పన్నాయని మరోసారి పునరుద్ఘాటించారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తాము అస్సలు అంగీకరించమని, దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తూనే వుంటామని ఇమ్రాన్ ప్రకటించారు.