హాంకాంగ్: మన దేశంలో కోట్లాది మంది వ్యాక్సిన్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా డోసులు దొరకని పరిస్థితి. మరోవైపు హాంకాంగ్లో మాత్రం వ్యాక్సిన్లు ఉన్నా తీసుకోవడానికి జనం ఆసక్తి చూపడం లేదు. దీంతో వ్యాక్సినేషన్లో వేగం పెంచడానికి అక్కడి ధనికులు, అధికారులు బహుమతుల ఆశ చూపుతున్నారు. వ్యాక్సిన్లు తీసుకుంటే బంగారు కడ్డీలు, టెస్లా కార్లు, ఐఫోన్లు, నగదు గిఫ్ట్లుగా ఇస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని హెండర్సన్ ల్యాండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రకటించగా.. సన్ హ్యాంగ్ కాయ్ ప్రాపర్టీస్ అనే మరో కంపెనీ ఐఫోన్లు ఇస్తోంది.
ఇక ఆస్ట్రేలియాకు చెందిన గుడ్మ్యాన్ గ్రూప్ అయితే ఆగస్ట్ 31లోపు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే లాటరీలో మిలియన్ హాంకాంగ్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు టెస్లా మోడల్ 3 కారు కూడా ఇస్తామని చెప్పినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. షాపింగ్ వోచర్లు, తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు సబ్సిడీలు వంటి ఆఫర్లను కూడా పలువురు పారిశ్రామికవేత్తలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈ మొత్తం ప్రకటనల విలువ 12 కోట్ల హాంకాంగ్ డాలర్లుగా ఉన్నట్లు తేలిందని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ తెలిపారు.
ఇక కంపెనీలు ప్రత్యేకంగా వ్యాక్సిన్ డ్రైవ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. హాంకాంగ్లో 75 లక్షల జనాభా ఉండగా.. అవసరానికి మించి వ్యాక్సిన్లను ఇప్పటికే సమకూర్చుకుంది. అయితే అక్కడ కేసులు లేకపోవడంతో వ్యాక్సిన్లు వేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. గత మే నెల నుంచి ఇలా బహుమతులు ప్రకటిస్తుండటంతో ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది.