వాషింగ్టన్, డిసెంబర్ 24: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. హెచ్1బీ సహా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకొన్నవారు ఇంటర్వ్యూల కోసం కాన్సులేట్లలో ప్రత్యక్షంగా హాజరుకావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ వీసా దరఖాస్తుదారులకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని అన్ని దేశాల్లోని తమ కాన్సులేట్లను ఆదేశించింది. హెచ్-1బీ (ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు), హెచ్-2 (తాత్కాలిక వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులు), హెచ్-3 ట్రైనీలు, ప్రత్యేక విద్య కోసం వచ్చేవాళ్లు), ఎఫ్, ఎం (విద్యార్థులు), జే (స్టూడెంట్ ఎక్సేంజ్ విజిటర్స్), ఎల్ (ఒకే సంస్థలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లేవాళ్లు), ఓ (అసాధారణ శక్తిసామర్థ్యాలున్న క్యాటగిరీకి చెందినవారు), వీ (అథ్లెట్లు, ఆర్టిస్టులు, వినోదరంగం వారు), క్యూ (ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్లో పాల్గొనేవారు) వీసా అభ్యర్థులకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని అమెరికా విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.