వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసాన్ని కోరుకునే భారతీయులకు గుడ్న్యూస్. ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారి కోసం అమెరికా ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నది. గ్రీన్కార్డు బ్యాక్లాగ్ క్యూలో చిక్కుకున్న వారి ప్రయోజనార్థం ఈ బిల్లును తీసుకురానున్నట్టు ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ తెలిపింది. సప్లిమెంటల్ ఫీజును (సూపర్ ఫీజు) చెల్లించిన వారికి గ్రీన్కార్డు బ్యాక్లాగ్ క్యూ అడ్డంకులను తొలగించనున్నట్టు ఆ బిల్లులో పేర్కొంది. ఇందులో భాగంగా ప్రాధాన్య తేదీ దాటి రెండేండ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు.. 5 వేల డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు. అదే ఈబీ-5 వీసాదారులు అయితే 50వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అమెరికా పౌరుడు స్పాన్సర్ చేసిన కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా గ్రీన్కార్డుల కోసం ఇప్పటికే 7.4 లక్షల మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆ దేశ పౌరసత్వం లభించాలంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 84 ఏండ్లు వేచిచూడాలి.