గ్లాస్గో: భారత రాయబారిని గురుద్వారాలోకి రాకుండా అడ్డుకోవడాన్ని గ్లాస్గో గురుద్వారా (Glasgow Gurdwara) తీవ్రంగా ఖండించింది. ఇది అక్రమమైన ప్రవర్తన అని, అన్ని వర్గాల ప్రజల కోసం గురుద్వారా తెరచేఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు గ్లాస్కో గురుద్వారా గురు గ్రంథ్ సాహిబ్ సిఖ్ సభ ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల క్రితం (శుక్రవారం) లండన్లోని భారత హైకమిషనర్ (Indian High Commissioner) విక్రమ్ దొరైస్వామి (Vikram Doraiswami) గురుద్వారా కమిటీ సమాశేంలో పాల్గొనేందుకు స్కాట్లాండ్లోని గ్లాస్గో (Glasgow) వెళ్లారు. ఈ సందర్భంగా గురుద్వారా సమీపంలో ఆయనను ఖలిస్థానీ మద్దతుదారులు (Khalistani extremists) అడ్డుకున్నారు. ఆహ్వానం లేదంటూ వెనక్కి పంపించారు. బ్రిటన్లోని ఏ గురుద్వారాలోనూ భారత అధికారులకు అనుమతి లేదన్నారు.
అయితే ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించిందంచిన విషయం తెలిసిందే. ఇది అవమానకర చర్యగా పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. బ్రిటన్ స్పందిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భారత్కు హామీ ఇచ్చింది. భారతీయులను గురుద్వారాలకు వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని, అందరికీ ఆహ్వా నం ఉంటుందని పేర్కొంది. కొంతమంది ప్రచారం కోసం ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపింది.
తాజాగా గురుద్వారా ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది. సెప్టెంబర్ 29న స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడి ఆహ్వానం మేరకు భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి గ్లాస్గో గురుద్వారా సందర్శణకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా వెలుపల ఆయనను పలువురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో యాన అక్కడి నుంచి వెళ్లిపోయారని గ్లాస్గో గురుద్వారా ఆ ప్రకటనలో వెల్లడించింది. భారత రాయబారి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ వికృత స్వభావం కలిగిన వ్యక్తులు తర్వాత కూడా దానిని కొనసాగించారని తెలిపింది. అయితే సిక్కుల పవిత్ర ప్రార్థనా స్థలమైన గురుద్వారాలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించడాన్ని తీవ్రంగా ఖడిస్తున్నామని వెల్లడించింది.