పారిస్: ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సహాయం అందించేందుకు ఆకస్ పేరుతో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కూటమిపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఆస్ట్రేలియాతో అమెరికా, బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుపట్టాయి. చైనాకు కౌంటర్గా న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ టెక్నాలజీని ఆస్ట్రేలియాకు బదిలీ చేయడాన్ని ఫ్రాన్స్ ఖండించింది. ఆ కూటమి తమను వెన్నుపోటు పొడిచినట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. కూటమిలో భాగమైన ఆ మూడు దేశాలు ప్రచ్ఛన్నయుద్ధ కాంక్షతో ఉన్నట్లు చైనా విమర్శలు చేసింది. కొత్త కూటమి చైనాను యుద్ధానికి ప్రేరేపించేలా ఉందని కొన్ని దేశాలు పేర్కొంటున్నాయి. ఆకస్ కూటమి తమను వెన్నుపోటు పొడిచినట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ యెవస్ లీ డ్రియాన్ అన్నారు. ఇది చాలా క్రూరమైన, ఏకపక్ష, అంచనా వేయలేని నిర్ణయమన్నారు.
ఆకస్ కూటమి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ దేశాల మద్య సైబర్ సామర్థ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండర్ సీ టెక్నాలజీ లాంటి అంశాల్లో టెక్నాలజీ షేరింగ్ ఉండనున్నది. దీని ప్రకారం అణ్వాయుధ సామర్థ్య సబ్మైరైన్లు ఉన్న ఏడవ దేశంగా ఆస్ట్రేలియా నిలువనున్నది. న్యూక్లియర్ సబ్మెరైన్ల కోసం రేస్ మొదలైనట్లు చైనా పత్రిక అభిప్రాయపడింది. అమెరికా వద్ద 68, రష్యా వద్ద 29, చైనా వద్ద 12, బ్రిటన్ వద్ద 11, ఫ్రాన్స్ వద్ద 8 అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్మెరైన్లు ఉన్నాయి. ఇక ఇండియా వద్ద ఒక అణ్వాయుధ జలాంతర్గామి ఉన్నది.