పోర్ట్ ఆఫ్ ప్రిన్స్: హైతీ అధ్యక్షుడు జోవెనల్ మొయిజ్ను దారుణంగా హత్య చేసిన ఘటనలో.. ఆ దేశ పోలీసులు ఓ విదేశీ ముఠాను పట్టుకున్నారు. కొలంబియా మిలిటరీకి చెందిన మాజీ సైనికులు ఆ ముఠాలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అధ్యక్షుడు మొయిజ్ను ఎందుకు టార్గెట్ చేశారన్న విషయం ఇంకా తెలియదు. కానీ నల్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు.. అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొయిజ్కు 12 బుల్లెట్లు దిగాయి. అయితే అధ్యక్షుడిని హత్య చేసిన విదేశీ ముఠాలో 26 మంది కొలంబియన్లు, ఇద్దరు అమెరికన్లు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం 17 మందిని అరెస్టు చేయగా.. 8 మంది పరారీలో ఉన్నారు. పోలీసులతో జరిగిన కాల్పుల్లో మరో నలుగురిని హత మార్చిన విషయం తెలిసిందే.
అధ్యక్షుడిని హత్య చేసిన నిందితుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కొలంబియా పాస్పోర్ట్లు కూడా ఉన్నాయి. విదేశీయులు వచ్చి అధ్యక్షుడిని చంపేశారని పోలీసు చీఫ్ చార్లెస్ తెలిపారు. మొయిజ్ను చంపిన వారిలో తమ దేశ మాజీ మిలిటరీ సభ్యులు ఉన్నట్లు కొలంబియా ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారు, ఆ మాస్టర్మైండ్ ఎవర్నన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2019లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ ఎన్నికలు వాయిదాపడుతూ వచ్చాయి. హత్య వెనుక డ్రగ్స్ కోణం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.