న్యూఢిల్లీ: గ్లోబల్ వార్మింగ్(Global Warming) అంటే ఏంటో తెలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాది అంతా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదు అయ్యాయి. గడిచిన 12 నెలలూ.. భూభాగం అంతటా 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. యురోప్కు చెందిన వాతావరణ శాఖ నిపుణులు ఈ నివేదికలను రిలీజ్ చేశారు. ఇది నిజంగా మానవాళికి వార్నింగే అని పేర్కొన్నారు. ఈయూకి చెందిన కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ఈ రిపోర్టును రిలీజ్ చేసింది. 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి వరకు నమోదు అయిన ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ విషయాన్ని చెప్పారు. 12 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు అయినట్లు సీ3ఎస్ పేర్కొన్నది.
తుఫాన్లు, కరువు, కార్చిచ్చులతో అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఎల్ నినో వెదర్ ప్రభావం కూడా సముద్రాలపై పడింది. ముఖ్యమంతా పసిఫిక్ మహాసముద్రంలో మార్పులకు కారణమైంది. గ్లోబల్ రికార్డుల ప్రకారం 2023 హాటెస్ట్ ఇయర్గా రికార్డు అయ్యింది. 1850 తర్వాత ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోయినట్లు రిపోర్టు ద్వారా వెల్లడైంది.
అధిక ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోకూడదని 2015లో ప్రపంచదేశాధినేతలు ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. పర్యావరణంలో పెను మార్పులు జరగకుండా ఉండాలంటే టెంపరేచర్లను అదుపులో ఉంచాలని పారిస్లో జరిగిన ఆనాటి ఒప్పందంలో నేతలు అంగకీరించారు. కానీ ఆ అగ్రిమెంట్కు చేరువగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సగటున ఏడాదికి 1.5 డిగ్రీల వేడి పెరగడం శోచనీయమని రాయల్ మెటీరియోలాజికల్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ లిజ్ బెంట్లే తెలిపారు. ఈ ఏడాది సముద్ర ఉపరితలం కూడా ఎన్నడూలేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.