ఒకటి కాదు.. రెండు కాదు.. 700 గొర్రెలు.. కరోనా పోరులో పాలుపంచుకున్నాయి. సిరంజి ఆకారంలో నిలబడి తమ వంతుగా కరోనాపై యుద్ధాన్ని ప్రకటించాయి. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. థర్డ్ వేర్ రూపంలో రూపం మార్చుకొని కరోనా మళ్లీ తన పంజాను విసిరింది. ఈనేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఈసందర్భంగా జర్మనీకి చెందిన ఓ క్యాంపెయినర్ సృష్టి ఇది. 700 గొర్రెలతో అతి పెద్ద సిరంజిని రూపొందించాడు. ఈ దృశ్యం డ్రోన్ కెమెరా ద్వారా అద్భుతంగా ఆవిష్కృతం అయింది.
కనీసం ఈ వీడియో చూశాక అయినా కోవిడ్ వ్యాక్సిన్ మీద అవగాహన పెరిగి కరోనాను తరిమికొట్టడం కోసం ప్రజలంతా ఏకమై వ్యాక్సిన్ వేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ గొర్రెలతో ఈ క్యాంపెయిన్ చేయించిన స్టీఫెన్ తెలిపాడు.
జర్మనీలో చాలామంది కరోనా వ్యాక్సినేషన్ అంటేనే వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఇలాగైనా వాళ్లకు అవగాహన కల్పించడం కోసం తన గొర్రెలతో అతి పెద్ద సిరంజిని ఏర్పాటు చేయించానని స్టీఫెన్ తెలిపాడు. ఇంకా.. గొర్రెలు అంటేనే పాజిటివిటీకి నిదర్శనం అని అందుకే దీని కోసం గొర్రెలను ఎంచుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
డ్రోన్ ద్వారా రికార్డు చేసి పైనుంచి గొర్రెల మందను చూస్తే పెద్ద సిరంజిలాగ కనిపిస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.