హైదరాబాద్: మన గెలాక్సీలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కానీ తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలను ఓ రహస్యం వెంటాడుతోంది. అంతరిక్షంలో సుదూర తీరన ఉన్న.. పాలపుంత నుంచి వస్తున్న రేడియో సంకేతాలు శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. సుమారు నాలుగు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మిల్కీవే నుంచి ప్రతి 18 నిమిషాలకు ఒకసారి రేడియో తరంగాలు రిలీజ్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఆ గెలాక్సీలో ఉన్న ఓ నక్షత్రం నుంచి ఆ తరంగాలు వస్తున్నట్లు గ్రహించారు. కానీ ఆ వస్తువును ఇప్పటి వరకు గమనించలేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముర్చిసన్ వైడ్ఫీల్డ్ ఆరే టెలిస్కోప్ ద్వారా ఆ నక్షత్ర సమూహాన్ని గుర్తించారు.
కుర్టిన్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిస్ట్ నటాషా హర్లే వాకర్ ఆ రహస్య వస్తువుకు చెందిన అంశాలను వెల్లడించారు. నేచర్ పత్రికలో దీనికి సంబంధించిన రిపోర్ట్ను పబ్లిష్ చేశారు. నక్షత్రం ఆకారంలో ఉండి.. తిరుగుతున్న ఆ అంతరిక్ష వస్తువును మార్చి 2018లో తొలిసారి గుర్తించారు. ఆ నక్షత్రం రిలీజ్ చేస్తున్న రేడియో సంకేతాలను భూమి నుంచి కూడా చూడవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదో రోదసీ లైట్హౌజ్ అంటున్నారు. బహుశా నక్షత్రం నిర్జీవం కావడమో లేక దట్టమైన న్యూట్రాన్ స్టార్ లేదా మరణించిన పొట్టి నక్షత్రమైనా అయి ఉంటుందని, దానికి అయస్కాంత శక్తి ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముర్చిసన్ వైడ్ఫీల్డ్ ఆరే టెలిస్కోప్తో అంతరిక్షాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఆ నక్షత్రాన్ని టైరోన్ ఓడోహెర్టి అనే డాక్టరేట్ విద్యార్థి గుర్తించాడు.