పాక్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యుద్ధం ప్రకటించారు. ఇక తాము ఊరుకోమని, ప్రభుత్వంపై పోరాడుతూనే వుంటామని ప్రకటించారు. మే నెల చివర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పెద్ద ర్యాలీని తీస్తున్నట్లు ప్రకటించారు. ఇక యుద్ధం ప్రారంభమైనట్లేనని, షరీఫ్ సర్కార్ను విడిచే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ప్రకటించారు.
ఈ ర్యాలీకి సంబంధించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తమ దేశాన్ని అవమానించిన వారిని విడిచే ప్రసక్తే లేదని, దీనికి నిరసనగా ఇస్లామాబాద్ వైపు ఓ ర్యాలీ తీయాలని, అందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంత కంటే ముందే పెషావర్, కరాచీ, లాహోర్లో పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించి, చివరి ర్యాలీకి సన్నద్ధం కావాలని ఇమ్రాన్ ఆలోచనగా చెబుతున్నారు.
ప్రధాని షహబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా ప్రజలందర్నీ ఉసిగొలపాలన్నది ఇమ్రాన్ ప్లాన్గా కొందరు పేర్కొంటున్నారు. ఇలా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి, దేశంలో మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలన్న యోచనలో ఇమ్రాన్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
ఇంకా తేదీలు ఖరారు కాలేదు…
అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ నిర్వహించాలని ఇమ్రాన్ నిర్ణయించినా… ఇంకా దీనికి తగ్గ ప్రణాళికను రచించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకైతే ర్యాలీ తేదీలను ఇంకా ప్రకటించలేదు. దేశ ద్రోహుల విషయంలో ప్రజలు ఎంతో నిరాశతో వున్నారని, వారికి ఇప్పటికిప్పుడే న్యాయం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే.. ప్రజలతో కలిసి, తాము దేశ ద్రోహులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సన్నద్ధమైనట్లు ఇమ్రాన్ పేర్కొన్నారు.
పాకిస్తాన్ రాజకీయంలో విదేశీ శక్తులంటూ వ్యాఖ్యలు
తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, అందుకు పాక్లోని నేతలు సహకరిస్తున్నారంటూ ప్రధాని హోదాలో ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆర్మీ ఖండించింది. అయితే.. మళ్లీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే ఇమ్రాన్ చేశారు.
పాక్ రాజకీయాల్లో విదేశీ శక్తులు చొరబడ్డాయని ఆరోపించారు. పాక్లోని కొన్ని శక్తులు వారితో చేతులు కలిపాయని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను చూసి ప్రజలు విసిగిపోయారని, కొత్త ప్రభుత్వం గద్దెనెక్కాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.