మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ప్రాణాలతో బయటపడినట్లు ఓ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఉక్రెయిన్పై అటాక్ వల్ల రష్యా మిలిటరీకి భారీగా నష్టం వచ్చింది. దీంతో రష్యాకు చెందిన కొందరు రాజకీయవేత్తలు పుతిన్ రాజీనామా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పుతిన్పై హత్యాయత్నం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. యూరో వీక్లీ న్యూస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ విషయం వెల్లడైంది. జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్లో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడు ఈ అటాక్ జరిగిందన్న విషయాన్ని దాంట్లో తెలుపలేదు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడి జరిపిన తర్వాత .. పుతిన్ ఆరోగ్యం, జీవితానికి సంబంధించి అనేక కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో అయిదు సార్లు తనపై హత్యాయత్నం జరిగిందని, వాటి నుంచి తప్పించుకున్నట్లు 2017లో ఓసారి పుతిన్ వెల్లడించారు.
పుతిన్ ప్రయాణించే లిమౌసైన్ వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ వాహనానికి చెందిన లెఫ్ట్ ఫ్రంట్ వీల్ ధ్వంసమైంది. ఢీకొట్టిన సమయంలో భారీ శబ్ధం కూడా వచ్చినట్లు టెలిగ్రామ్ ఛానల్ రిపోర్ట్లో తెలిపారు. లిమౌసైన్ కారును ఢీకొన్న సమయంలో భారీగా పొగలు కూడా వచ్చాయని, కానీ సురక్షితంగా ఆ కారును చేర్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఎటువంటి గాయం కాలేదు. కానీ ఈ ఘటనలో అనేక మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రయాణించే వాహనాన్ని ఢీకొట్టినట్లు మరో సైట్లోనూ న్యూస్ రాశారు.
సెయింట్ పీటర్స్బర్గ్లోని రాజకీయవేత్తలు పుతిన్పై దేశద్రోహం కేసు పెట్టాలని భావిస్తున్నారు. పుతిన్ను అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు యూరో వీక్లీ తన కథనంలో తెలిపింది. పీటర్స్బర్గ్లోని 65 మంది మున్సిపల్ ప్రతినిధులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు పుతిన్ రాజీనామా కోరుతూ పిటిషన్పై సంతకం చేశారు.