global warming| న్యూయార్క్: పర్యావరణ మార్పులపై ప్రపంచదేశాలు తక్షణమే చర్యలకు పూనుకోవాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ అభ్యర్థించారు. జూలైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడపై ఆయన స్పందించారు. భూమి గ్లోబల్ వార్మింగ్ శకం దాటి గ్లోబల్ బాయిలింగ్ శకంలోకి ప్రవేశించిందని వ్యాఖ్యానించారు. భూమి విధ్వంసక స్థితికి చేరుకున్నదని చెప్పారు. పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు ముందు నుంచీ హెచ్చరిస్తున్నట్టుగానే, పర్యావరణ విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఇందులో ఒకే ఒక్క ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. పర్యావరణ మార్పుల వేగం పెరగడమేనని పేర్కొన్నారు.
‘పీల్చలేని విధంగా గాలి తయారైంది. తట్టుకోలేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం, పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకపోవడం ఇక ఏమాత్రం సమ్మతం కాదు’ అని గుటెరస్ అన్నారు. ఇక సంశయాలు ఉండ కూడదని, సాకులు చెప్పరాదని, ఇతరులు చర్యలు ప్రారంభించేదాకా వేచిచూడకూడదని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు 2040 నాటికల్లా, వర్తమాన దేశాలు 2050 నాటికల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలని స్పష్టంచేశారు.