Earthquake: జపాన్లో వరుస భూకంపాలు, సునామీ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత పౌరుల సౌకర్యార్థం జపాన్లోని ఇండియన్ ఎంబసీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ను ప్రకటించింది. అవసరమైన ఇండియన్ సిటిజన్స్ ఆయా నంబర్స్కు కాల్ చేసి తమకు కావాల్సిన వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది.
జపాన్లోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించిన ఐదు ఎమర్జెన్సీ నంబర్స్లో 818039301715 (యాకూబ్ టోప్నో), 817014920049 (అజయ్ సేథి), 818032144734 (డీఎన్ బర్న్వాల్), 818062295382 (ఎస్ భట్టాచార్య), 818032144722 (వివేక్ రథీ) ఉన్నాయి.
Embassy of India in Japan issues emergency contact numbers for Indian citizens following a strong earthquake and tsunami warnings pic.twitter.com/Ge1zdp1kVP
— ANI (@ANI) January 1, 2024
జపాన్ను సోమవారం వరుస భూకంపాలు వణికించాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం జపాన్లో వరుసగా 21 సార్లు భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మొదట 4:06 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) 5.7 తీవ్రతతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ తర్వాత 4:10 గంటలకు 7.6 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. 4:18 గంటల సమయంలో 6.1 తీవ్రతతో, 4:23 గంటలకు 4.5 తీవ్రతతో, 4:29 గంటలకు 4.6 తీవ్రతతో, 4:32 గంటలకు 4.8 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి.
భారీ భూకంపాల నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర రాష్ట్రాలైన ఇషికావా, నీగటి, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని ఆదేశించింది. జపాన్ తీరం వెంబడి భూకంపం కేంద్రానికి 300 కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత పౌరుల సౌకర్యార్థం ఇండియన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ను ప్రకటించింది.