Epstein files : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్స్టీన్ చేసిన అరాచకాలలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వివాదంలో ఇప్పుడు ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒక ఫొటో విడుదలైంది. ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్లో ఈ ఫొటో లభ్యమైంది. ఈ ఫొటోలో లింకుడ్ ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్మన్, పే పాల్ కో ఫౌండర్ పీటర్ థెయిల్ కూడా హాజరయ్యారు.
దీనికి సంబంధించిన మెయిల్లో ఈ ఈవెంట్ను ‘వైల్డ్’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలో వీళ్లంతా రాత్రి పూట డిన్నర్ చేస్తుండగా, ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. ఈ ఫొటో ఎప్స్టీన్ తీసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటో 2015, ఆగష్టు 3న తీసినట్లు వెల్లడైంది. అయితే, ఈ అంశంపై ఇటీవల ఎలాన్ మస్క్ స్పందించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఆయన తాను ఎప్పుడూ ఎప్స్టీన్ పార్టీలకు హాజరు కాలేదని వెల్లడించాడు. అంతేకాదు.. పిల్లలపై అత్యాచారం, హత్య వంటి నేరాలకు పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని, ఆ ఫైల్స్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశాడు. కానీ, ఇప్పుడు మస్క్ పాల్గొన్న ఫొటో విడుదలైంది. ఈ అంశంపై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా దీనిపై స్పందించారు.
ఒక డిన్నర్ సందర్భంగా తాను ఎప్స్టీన్ను కలిశానని, ఆ పార్టీ తర్వాత తానెప్పుడూ మళ్లీ ఆయనను కలవలేదని చెప్పుకొచ్చినట్లు మెటా గతంలోనే వెల్లడించింది. మరోవైపు లింకుడ్ ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్మన్ ఇటీవల స్పందిస్తూ.. తాను ఒక సంస్థ నిధుల సేకరణ కోసం ఎప్స్టీన్ను కలిశానని, అంతకుమించి ఎప్స్టీన్ చేసిన నేరాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాజాగా వెల్లడైన మెయిల్ను ఎప్స్టీన్ తనకుతానే సెండ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ నేరాలకు సంబంధించిన ఫైల్స్ను అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.