కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ తాజాగా పాకిస్థాన్ను హెచ్చరించింది. ఖోస్ట్, కునార్ ప్రావిన్సుల్లో శుక్రవారం పాక్ వైమానిక దాడుల్లో 40 మందికిపైగా పౌరులు చనిపోవడంపై ఆదివారం స్పందించింది. ‘ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షించొద్దు. తర్వాత జరిగే పరిణామాలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉండాలి’ అని తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన సమాచార, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి జబివుల్లా ముజాహిద్ హెచ్చరించారు. పాక్ వైమానిక దాడులను ఖండించిన ఆయన ఇలాంటివి మరోసారి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ చర్యల వల్ల ఇరు దేశాల మధ్య వివాదాలు పెరుగుతాయని, ఇది ఎవరికీ మంచిది కాదన్నారు. చర్చలు, సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని తాలిబాన్ ప్రధాన అధికార ప్రతినిధి అయిన ముజాహిద్ తెలిపారు.
కాగా, పాకిస్థాన్ వైమానిక దాడులపై కాబూల్లోని పాకిస్థాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్ను తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం పిలిపించింది. ఇలాంటి దాడులు భవిష్యత్లో జరుగకుండా నిరోధించాలని కోరింది.