మలేషియా మంత్రి సితి జైలా మహ్మద్ యూసఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. భార్య గనక మొండిగా, అసభ్యంగా వ్యవహరిస్తే ఆమెపై చేయి చేసుకోవాలని అన్నారు. ఇలా చేస్తేనే భార్య క్రమశిక్షణతో ఉంటుందన్నారు. భార్య గనక భర్త సలహాలను పాటించని పక్షంలో మూడు రాత్రుల పాటు ఆమెతో నిద్రించకూడదని అన్నారు. అయినా దారికి రాని పక్షంలో ఇక కొడుతూ.. విరుచుకుపడాలని అన్నారు. ఇలా చేస్తేనే భర్త అంటే ఏమిటో వారికి తెలిసొస్తుందన్నారు.
ఇక… మరో సలహా కూడా ఇచ్చారండోయ్. ఇక భార్యలు తమ తమ భర్తల మనస్సులు చూరగొనాలంటే.. భర్తల అనుమతి తీసుకున్న తర్వాతే ఏదైనా చెప్పాలని, ఏదైనా చేయాలని, దీని ద్వారా భర్త మనస్సు చూరగొంటారని సదరు మంత్రి తెలిపారు. అన్నం తినే సమయంలో గానీ, పడుకున్న సమయంలో గానీ, ఇతర సమయాల్లో గానీ భర్త అనుమతి తీసుకొని మాట్లాడితే.. ఆయన మనస్సు చూరగొంటారని మలేషియా మంత్రి సితిజైలా మహ్మద్ యూసుఫ్ అన్నారు.
అయితే ప్రతిపక్షాలతో సహా… సామాన్య ప్రజలు కూడా ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా గృహ హింసను ప్రోత్సహిస్తున్నారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోనూ ఈ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.