న్యూఢిల్లీ: ఆకాశంలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ రాత్రికి మన సౌరవ్యవస్థలోని గ్రహాలన్ని ఒకేసారి దర్శనమివ్వనున్నాయి. వాటిలో మన భూగ్రహానికి అత్యంత దూరంలో ఉన్న యురేనస్, నెఫ్ట్యూన్లను బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చు. మిగిలిన ఐదు గ్రహాలైన బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శనిలను ఎలాంటి సాధనాలు వినియోగించకుండా కండ్లతో నేరుగా చూడవచ్చు.
గురువారం ఉత్తరార్ధగోళంలో నైరుతి దిగువ భాగం నుంచి తూర్పు వైపునకు శుక్ర, బుధ, శని, బృహస్పతి, అంగారక గ్రహాలు కొంచెం అటుఇటుగా ఒకే వరుసలో దర్శనమిచ్చాయి. వీటిని కండ్లకు ఎలాంటి సాధనాలను వినియోగించకుండానే చూడవచ్చు. ఇక బైనాక్యులర్లను ఉపయోగించి శని, గురు గ్రహాల మధ్య నెప్ట్యూన్ను.. అంగారక, గురు గ్రహాల మధ్య యురేనస్ను గమనించవచ్చు. ఈ ఏడాది చివరి రోజు వరకు గ్రహాలన్ని ఇంచుమించు దగ్గరదగ్గరగానే కనిపిస్తాయి.
ఈ రాత్రి 9 గంటలకు ఒకే వరుసలోకి..
బుధవారం రాత్రికల్లా గ్రహాలన్నీ 1.5 డిగ్రీ కోణంలోకి వచ్చాయి. ఇవాళ రాత్రి 9 గంటలకల్లా ఆ గ్రహాలన్ని తమ క్లోజెస్ట్ పాయింట్కు చేరి ఐక్యంగా కనిపిస్తాయి. అంతే ఒకే బిందువుపై దర్శనమిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలనుకునేవారు ఈ రాత్రికి ఆకాశంలో పశ్చిమంవైపు ముఖం చేసి దిగువవైపున పరిశీలించాలి. గ్రహాలన్ని ఒక్కచోట, ఏకకాలంలో కనిపిస్తాయి.
ఈ రోజు, రేపు రెండు రోజులపాటు సూర్యస్తమయం కాగానే శుక్ర గ్రహం 40 నిమిషాలపాటు ఆకాశంలో తళుకులీనుతుంది. సాధారణంగా ఆకాశంలో బాగా ప్రకాశవంతమైన ప్రదేశంలో ఉండటంవల్ల బుధ గ్రహం స్పష్టంగా కనిపించదు. కానీ ఇప్పుడు బుధుడు, శుక్రుడు ఒకే పాయింట్లోకి వస్తారు కాబట్టి శుక్ర గ్రహం వెలుగులో బుధ గ్రహం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక మిగిలిన గ్రహాల్లో దక్షిణంవైపు అత్యంత ఎత్తులో పెద్దగా ప్రకాశవంతంగా గురు గ్రహం దర్శనమిస్తుంది. దాని నుంచి తూర్పు దిశలో వరుసగా ఇతర గ్రహాలు ఉంటాయి. రెండో అతిపెద్ద గ్రహమైన శని బంగారు వర్ణంలో, అంగారక గ్రహం ఎరుపు వర్ణంలో వీక్షకులను ఆకట్టుకుంటాయి.