కొలంబో, జూలై 21: శ్రీలంక అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రి నియామకంపై దృష్టిసారించారు. రాజపక్స కుటుంబానికి విశ్వాసపాత్రుడు, సీనియర్ నేత దినేశ్ గుణవర్దెనను తదుపరి ప్రధానిగా నియమించనున్నట్టు సమాచారం.
అఖిలపక్ష ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు సహకరించేంతవరకూ ప్రస్తుత క్యాబినెట్నే అధ్యక్షుడు కొనసాగించనున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. మరోవైపు, ఆందోళనలకు భయపడి దేశం వదిలి పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆశ్రయం కల్పించడాన్ని నిరసిస్తూ సింగపూర్ ప్రభుత్వంపై లంకేయులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆ దేశం స్పందించింది. జూలై 14న తమ దేశంలోకి వచ్చిన గొటబయకు 14 రోజుల తాత్కాలిక వీసాను మంజూరు చేసినట్టు సింగపూర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.