బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు వ్యతిరేకంగా ఆ దేశంలో బ్యానర్లు వెలిశాయి. ఆయనను నియంతృత్వ ద్రోహిగా ఆరోపించడంతోపాటు అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) 20వ కాంగ్రెస్ సమావేశం జరుగనున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. హైడియన్ జిల్లాలోని ఒక ఫ్లై ఓవర్పై ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
చైనా జీరో కోవిడ్ విధానం, నిరంతర లాక్డౌన్లను ఆ బ్యానర్లలో వ్యతిరేకించారు. విప్లవాత్మక మార్పు అవసరమని అందులో పిలుపునిచ్చారు. ఒక బ్యానర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ‘నియంతృత్వ ద్రోహి’ అని పేర్కొన్నారు. ‘స్కూళ్లు, పని ప్రాంతాల నుంచి సమ్మె చేద్దాం… నియంతృత్వ ద్రోహి జి జిన్పింగ్ను తొలగిద్దాం’ అని అందులో ఉంది. ‘మాకు కరోనా పరీక్షలు, లాక్డౌన్లు వద్దు. మేం తినాలి. స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాం’ అని మరొక బ్యానర్లో పేర్కొన్నారు.
బీజింగ్కు చెందిన జర్నలిస్ట్ స్టీఫెన్ మెక్డొనెల్ ఈ బ్యానర్ల ఫొటోలు, వీటి గురించి ట్విట్టర్లో పేర్కొన్నారు. చైనా అధికారులు వాటిని తొలగించారని వెల్లడించారు. మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తున్న జిన్పింగ్పై చైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు దీని ద్వారా తెలుస్తున్నది.
— Stephen McDonell (@StephenMcDonell) October 13, 2022