కాఠ్మాండు, జూలై 13: నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా ఐదోసారి ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేవుబాను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి మంగళవారం ప్రధానిగా నియమించారు. అయితే ఆయన ప్రమాణస్వీకారం మాత్రం.. ముందుగా నిర్దేశించిన దాని ప్రకారం సాయంత్రం ఆరుగంటలకు కాకుండా రెండు గంటలు ఆలస్యమైంది. అధ్యక్షురాలు జారీ చేసిన నియామక పత్రంలో ఏ ఆర్టికల్ కింద తనను ప్రధానిగా నియమించారో వెల్లడించలేదనే కారణంతో ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమం ఆలస్యమైంది. దేవుబా గతంలో నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఆయన 30 రోజుల్లో పార్లమెంటులో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.