వెల్లింగ్టన్: కోవిడ్ నిబంధనలపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో.. ఆమె మూడేళ్ల కూతురు ఆ లైవ్ ఈవెంట్లోకి అకస్మాత్తుగా వచ్చేసింది. ఇంటి నుంచే రాత్రి పూట ఫేస్బుక్లో కోవిడ్ చర్యల గురించి మాట్లాడుతున్నప్పుడు.. మమ్మీ అంటూ అకస్మాత్తుగా ఓ చిన్నారి స్వరం వినిపించింది. జెసిండా మూడేళ్ల కూతురు నీవ్.. తల్లి ప్రసంగాన్ని అడ్డుకున్నది. ఆ సమయంలో జెసిండా కూడా చాలా తెలివిగా తన కూతుర్ని ఓదార్చింది. డార్లింగ్, ఇప్పుడు నువ్వు నిద్ర పోయే సమయమని కూతురుకి నచ్చచెప్పింది. కానీ కూతురు నీవ్ మాత్రం నో అంటూ మాటవినలేదు. నిద్రపోయే టైమైందని, పడుకోవాలని బుజ్జగించింది, సెకన్లో వచ్చేస్తాను, జస్ట్ ఒక నిమిషంలో వచ్చి కలుస్తాను, ఓకేనా, సారీ అంటూ ఆర్డెర్న్ తన కూతుర్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఫేస్బుక్ లైవ్ను మళ్లీ కంటిన్యూ చేశారామె. ఆ తర్వాత కొన్ని సెకన్లకే మళ్లీ ఆమె కూతుర స్వరం వినిపించింది. ఎందుకింత సమయం తీసుకుంటున్నాని నీవ్ తల్లిని అడిగింది. సారీ డార్లింగ్, ఎక్కువ టైమ్ తీసుకుంటున్నా, ప్రతి ఒక్కరికీ సారీ అంటూ.. నీవ్ నిద్రటైమ్ అయిపోయిందని, ఆమెను పడుకోబెడుతానని, మళ్లీ కలుద్దామంటూ తన ఎఫ్బీ లైవ్ను ఆర్డెర్న్ ఆపేశారు.