న్యూయార్క్: యూఎన్ వేదికగా పాకిస్థాన్పై మరోసారి భారత్ విరుచుకుపడింది. డీ కంపెనీ మూఠాకు ఆ దేశం ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోపించింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారికి పాకిస్థాన్ రక్షణ కల్పిస్తున్నట్లు ఇండియా పేర్కొన్నది. దావూద్ ఇబ్రహీంకు చెందిన వర్గానికి ఫైవ్ స్టార్ హాస్పిటాలిటీ కల్పిస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించింది. భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ టీఎస్ తిరుమూర్తి ఐక్యరాజ్యసమితిలో ఈ ఆరోపణలు చేశారు. ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ 2022లో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల మధ్య లింకులను గుర్తించి, సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని తిరుమూర్తి సూచించారు. 1993 ముంబై పేలుళ్ల నిందితులు సిండికేట్ నేరాలకు పాల్పడ్డారని, వాళ్లకు పాకిస్థాన్ రక్షణ ఇవ్వడమే కాకుండా, ఫైవ్ స్టార్ ఆతిథ్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు. అయితే దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నట్లు 2020 ఆగస్టులో పాకిస్థాన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపును అడ్డుకోవాలని తిరుమూర్తి యూఎన్ను కోరారు.