హైదరాబాద్ : అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. దాదాపు 10 నెలల విరామం తర్వాత పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాయని ఆనందించేలోపే అది మూడునాళ్ళ ముచ్చటగా మారిపోతుంది. నన్ను మీరు మర్చిపోయారు అంటూ కరోనా వైరస్ మళ్ళీ ఇండస్ట్రీపై దాడి చేస్తుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైన తర్వాత చాలామంది వైరస్ బారిన పడ్డారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరోయిన్ నివేద థామస్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంది.
ఇంత దారుణమైన పరిస్థితుల్లో సినిమా షూటింగ్ మళ్లీ యథావిధిగా కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా ఈ ప్రభావం ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాపై భారీగా పడుతుంది. ఈ చిత్ర షూటింగ్ అప్పట్లో దుబాయ్లో జరిగింది. ఆ తర్వాత గోవాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు పరుశురాం. అయితే ప్రస్తుతం అక్కడ పాజిటివ్ కేసులు విపరీతంగా ఉండడంతో షూటింగ్ మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గోవా షెడ్యూల్ ఇప్పట్లో ఉండకపోవచ్చు దీన్ని పూర్తిగా క్యాన్సల్ చేసి మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు పరశురామ్.
అది కూడా కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండేలా చూసుకుంటున్నాడు. మరోవైపు మహేష్ బాబు కూడా హైదరాబాద్ దాటి బయటికి వచ్చేలా కనిపించడం లేదు. సిటీలోనే 25 రోజుల పాటు నాన్ స్టాప్ షూటింగ్ జరగనుంది. ఏదేమైనా కరోనా కారణంగా సర్కారు వారి పాట షెడ్యూల్స్ అంతా గజిబిజిగా మారిపోయాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు జయరామ్ ఇందులో మహేష్ తండ్రిగా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఆర్థిక నేరాల నేపథ్యంలో కథను రాసుకున్నాడు పరశురాం.