ప్యాంగాంగ్: కిమ్ కింగ్డమ్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఒకే రోజు 2,96,180 మందిలో జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఉత్తర కొరియాలో కరోనా అనుమానిత కేసులు 8,20,620కు చేరాయి. దేశవ్యాప్తంగా 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారని అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. జ్వరంతో మరో 15 మంది మరణించారని తెలిపింది.
నార్త్ కొరియాలో మొదటి కరోనా కేసు గత గురువారం (ఈ నెల 12న) నమోదైంది. మరిసటి రోజు (13వ తేదీన) కరోనాతో ఓ వ్యక్తి మరణించారు. ఇప్పటివరకు 42 మంది మృతిచెందారు. కాగా, కరోనా తొలిసారిగా వెలుగు చూసిన వెంటనే అధ్యక్షుడు కిమ్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోడం గమనార్హం.