Chinese Woman | సాధువు రూపంలో ఢిల్లీలో తలదాచుకుంటున్న చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్లోని ఖాట్మాండు ప్రాంతం నుంచి వచ్చానని నమ్మించి… ఢిల్లీలోని టిబెట్ శరణార్థుల క్యాంప్లో సదరు మహిళ గత కొంతకాలంగా ఆశ్రయం పొందుతోంది. సాధువు రూపంలో ఉన్న ఈ మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆ మహిళ చైనా పౌరురాలని విచారణలో తేలింది. ఆమె అసలు పేరు కై రుయో అని, 2019లో చైనా నుంచి భారత్లో అడుగుపెట్టినట్లు వెల్లడైంది. చైనాలోని కమ్యూనిస్టు లీడర్లతో తనకు ప్రాణభయం ఉందని, అందుకే పేరు మార్చుకుని భారత్లో తలదాచుకుంటున్నానని చెప్పింది. అయితే, ఆమె గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
టిబెట్ నుంచి భారత దేశానికి వచ్చిన శరణార్థుల కోసం ఢిల్లీలో మంజు కా టిల్లా పేరుతో ప్రభుత్వం ఓ క్యాంప్ నిర్వహిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్కు సమీపంలో ఉందీ క్యాంప్. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతంగా దీనికి పేరుంది. ఇక్కడ ఉండేవాళ్లను పోలీసులు నిరంతరం ఓ కంట కనిపెడుతూ ఉంటారు.