వాషింగ్టన్: కరోనా వైరస్ పుట్టుకపై అమెరికా ప్రముఖ వైద్యుడు ఆంటోనీ ఫౌచీ అబద్ధాలు చెప్పారా.. శాస్త్రీయ ఆధారాల సాకుతో వైరస్ను, చైనాను కవర్ చేశారా.. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆయన ఈ మెయిల్స్ వివరాలు ఇదే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, బజ్ ఫీడ్ వార్తాసంస్థలు గతేడాది జనవరి నుంచి జూన్ మధ్యలో ఫౌచీ మెయిల్స్ వివరాలను పొందాయి. కరోనా పుట్టుక గురించిన ప్రకటనల విషయంలో ఈ వివరాలు ఫౌచీ పాత్రపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ‘కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందనేందుకు ఆధారాలు లేవు’ అని ఫౌచీ చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కూడా మెయిల్స్ ఉన్నాయి. కరోనా గురించి ఫౌచీ ప్రపంచానికి చెప్పినదానికన్నా, దాచి పెట్టిందే ఎక్కువ అని, ఫౌచీ మెయిల్స్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని చైనా వైరాలజిస్టు లీ-మెంగ్ యాన్ చెప్పారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందని మొదట్లోనే చెప్పిన అతికొద్ది మందిలో ఆమె ఒకరు. చైనా ప్రభుత్వం భయానికి ఆమె కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల వూహాన్ ల్యాబ్లీక్ సిద్ధాంతానికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె న్యూస్మ్యాక్స్తో మాట్లాడారు. ఫౌచీ ఈమెయిల్స్ చూస్తే తాను చెప్పింది నిజమేనని కచ్చితంగా అర్థం అవుతుందన్నారు.
తప్పుడు అర్థాలను ఆపాదిస్తున్నారు
విమర్శకులు తన మెయిల్స్కు తప్పుడు అర్థాలను ఆపాదిస్తున్నారని, వక్రభాష్యం చెప్తున్నారని ఫౌచీ అన్నారు. వైరస్ పుట్టుకపై తాను ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడినట్టు చెప్పారు. ‘చైనా ఉద్దేశపూర్వకంగా వైరస్ను అభివృద్ధి చేసి ప్రపంచం మీదకు వదిలిందని నేను భావించడం లేదు’ అని చెప్పారు. ఇదిలా ఉండగా, వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని శాస్త్రీయ ఆధారాలు లేవని గతంలో అన్న ఫౌచీ, ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశం ఉందని, దీనిపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఇటీవల వ్యాఖ్యానించారు.
వుహాన్ ల్యాబ్కు అమెరికా నిధులు!
కరోనావైరస్ మొదట వచ్చిందని భావిస్తున్న వుహాన్ వైరాలజీ ల్యాబ్కు అమెరికా నిధులు సమకూర్చినట్టు స్వతంత్ర దర్యాప్తు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా వైరస్ వేగంగా జన్యుక్రమం మార్చుకొనేలా పరిశోధనలు నిర్వహించినందుకు ల్యాబ్ హెడ్ షీ జెంగ్లీకి అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్ఐహెచ్) నుంచి రూ.4.38 కోట్లు ముట్టినట్టు పేర్కొన్నాయి. గబ్బిలాలపై జెంగ్ లీ పరిశోధనలకు గాను ఆమెను ‘బ్యాట్ వుమన్’ అని పిలుస్తారు.