న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం చైనాకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గామి(China Submarine).. పాకిస్థాన్లోని కరాచీ హార్బర్లో దర్శనమిస్తున్నాయి. హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్ల ద్వారా ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థ ద్రువీకరించింది. చైనా, పాక్ మధ్య భారీ స్థాయిలో నౌకాదళ సీ గార్డియన్-3 విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దృశ్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన వార్షిప్లు, సబ్మెరైన్తో పాటు వివిధ రకాల షిప్లు కరాచీ డాక్యార్టులో ఉన్నట్లు గుర్తించారు.
ఇటీవల హిందూ మహాసముద్రంలో తరుచూ చైనా యుద్ధ నౌకలు పహారా కాశాయి. బంగాళాఖాతంలో షి యాన్ 6 రీసర్చ్ షిప్ చక్కర్లు కొట్టింది. కరాచీలో ఉన్న సబ్మెరైన్ను.. టైప్ 039 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్గా గుర్తించారు. 2013 తర్వాత ఎనిమిదోసారి భారత జలాల్లోకి చైనా తన జలాంతర్గామిని తీసుకువచ్చింది. మలాక్కా సంధి రూట్లో టైప్-039 సబ్మెరైన్ వెళ్తున్న సమయంలో నేవీ పీ8 విమానాలు గుర్తించినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
చైనా నుంచి 8 టైప్ 039 సబ్మెరైన్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం 2015లో ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ కొనుగోలు ఖరీదు 5 బిలియన్ల డార్లు. కరాచీ షిప్యార్డులోనే నాలుగు జలాంతర్గాములను నిర్మించాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సబ్మెరైన్ను డెవలరీ చేయలేదు. ప్రస్తుతం కరాచీలో 926 రకం జలాంతర్గామి ఉన్నట్లు శాటిలైట్ ఇమేజ్లు ద్రువీకరించాయి. ఈ రకమైన జలాంతర్గామి .. కష్టాల్లో ఉన్న సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగలదు.
కరాచీలో ఉన్న యుద్ధ నౌకల బృందంలో.. టైప్ 52డీ డెస్ట్రాయర్, టూ టైప్ 54 ఫ్రిగేట్స్, టైప్-903 రిప్లెనిస్మెంట్ ఆయిలర్ ఉన్నాయి.